ఏపీలో భారీ వర్షాలు... ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్..!
ఏపీలో భారీ వర్షాలు... ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్..!

నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు .. మరీ రెడ్ అలర్ట్ జారీచేసే స్థాయిలోనా..!
ఆంధ్రప్రదేశ్, తెెలంగాణ రాష్ట్రాల్లో నేడు వర్షాలు దంచి కొట్టనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రెడ్ అలర్ట్ జారీ చేసారంటేనే ఏ స్థాయిలో వానలు పడతాయో అర్థంచేసుకోవచ్చు. ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటే
వేసవికాలంలో ఓవైపు మండుటెండలు, మరోవైపు దంచికొడుతున్న వానలతో తెలుగు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయమే సుర్రుమంటున్న ఎండలు మధ్యాహ్నానికి తారాస్థాయికి చేరుతున్నాయి... అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం అయ్యిందంటే చాలు ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది... ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
ఇవాళ (మే 6, మంగళవారం) కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండావాన పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మూడ్రోజులు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వర్షతీవ్రత ఎక్కువగా ఉండే అవకాశమున్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు. ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు తెలంగాణలో ఈ మూడురోజులు (మంగళ, బుధ, గురువారం) వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి , ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, జనగాం, యాదాద్రి, నల్గొండ, గద్వాల, వనపర్తి, సూర్యాపేట, నారాయణపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. ఇక రాజధాని హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని... కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం దంచికొడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
సోమవారం తడిసిముద్దయిన హైదరాబాద్ : నిన్న(సోమవారం) హైదరాబాద్ లో వర్షం దంచికొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన జోరు వాన కురిసింది. ఉప్పల్ ప్రాంతంలో కూడా ఇలాగే వర్షం కురవడంతో ఐపిఎల్ 2025 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, డిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్దాంతరంగా ఆగిపోయింది. హైదరాబాద్ లో అత్యధికంగా లంగర్ హౌజ్ ప్రాంతంలో 2.8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక ఆసిఫ్ నగర్ లో కూడా 2.7 సె.మీ వర్షపాతం నమోదయ్యింది. ఇలా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవగా మిగతా ప్రాంతాలు ఈదురుగాలులతో చల్లబడ్డాయి. ఈ మూడ్రోజులు కూడా హైదరాబాద్ లో ఇలాంటి వాతావరణమే ఉంటుందని ప్రకటించారు.
ఏపీకి రెడ్ అలర్ట్ : ఆంధ్ర ప్రదేశ్ లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో అయితే కుండపోత వానలు పడే అవకాశాలున్నాయంటూ రెడ్ అలర్ట్ జారీ చేసారు. ఇలా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, ఎన్టిఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అనకాపల్లి, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూల్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కృష్ణా జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రైతుల ధాన్యం తడిసి ముద్దవుతోంది. ఇలా తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరా శాఖల మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు.
పంట నష్టపోయిన రైతులకు మంగళవారం సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పంటనష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా పిడుగుపాటుకు గురై చనిపోయిన 8 మంది బాధితుల కుటుంబాలకు పరిహారం కూడా తక్షణమే అందించాలని ఆదేశించారు.
What's Your Reaction?






