అవును.. తప్పు చేశాం! కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్లుగా మారిన నిందితులు
అవును.. తప్పు చేశాం! కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్లుగా మారిన నిందితులు
-అవును.. తప్పు చేశాం! -కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్లుగా మారిన ముగ్గురు -నిందితుల్లో డెయిరీ ఎక్స్పర్ట్ సురేంద్రనాథ్. -ప్రొటోకాల్ దర్శనాలు, మర్యాదలతో వల. -మర్యాదలకు మురిసి తప్పు చేశానని విలవిల. -కోర్టులో నేరం అంగీకరించిన టాప్ సైంటిస్ట్. -రసాయనాల సరఫరా వ్యాపారి, భోలేబాబా డెయిరీ ఉద్యోగి సైతం నేరాంగీకారం. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అక్రమార్కులు ఓ టాప్ సైంటిస్టును కూడా ప్రలోభాలకు గురిచేశారు.
తిరుమలలో దర్శనాలు, వసతి ఏర్పాట్లలో ప్రొటోకాల్ మర్యాదలు చేసి బుట్టలో వేసుకున్నారు. వారి మర్యాదలకు మురిసిపోయి కల్తీ నెయ్యి వ్యవహారంలో డెయిరీలకు సహకరించినట్టు కోర్టు ఎదుట ఆయన అంగీకరించారు. ఈ కేసులో అప్రూవర్గా మారిన డెయిరీ ఎక్స్పర్ట్ డాక్టర్ బత్తల సురేంద్రనాథ్ గత డిసెంబరు మొదటి వారంలో కోర్టు ముందు హాజరయ్యారు. నేరాంగీకారంతో పాటు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వెల్లడించారు.
నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు సంబంధించి బెంగళూరులోని రీజనల్ సెంటర్లో కెమిస్ట్రీ విభాగానికి అధిపతిగా పనిచేసిన సురేంద్రనాథ్ ఐదేళ్ల కిందట రిటైరయ్యారు. 2013 నుంచీ టీటీడీకి నెయ్యి కొనుగోలు విషయంలో సలహాలు, సూచనలు, అవసరమైన నివేదికలిస్తూ సహకరించారు. టెండర్లలో పాల్గొనే డెయిరీలను, ప్లాంట్లను తనిఖీ చేసి, వాటి నెయ్యి తయారీ సామర్థ్యం పరిశీలించి టీటీడీకి నివేదికలు ఇచ్చేవారు. అందులో భాగంగా టీటీడీ నియమించిన ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీలో నెయ్యి నిపుణుడి హోదాలో సభ్యుడుగా పనిచేశారు. డెయిరీ టెక్నాలజీ ముఖ్యంగా నెయ్యికి సంబంధించి దేశంలోని అత్యున్నత స్థాయి సైంటిస్టుల్లో సురేంద్రనాథ్ కూడా ఒకరు.
ఆయనకు టీటీడీలో కేవలం మార్కెటింగ్ జీఎం, ఈవో మినహా మరెవ్వరూ తెలియదని సమాచారం. నేరుగా వారిద్దరితోనే మాట్లాడడం, కలవడం చేసేవారని సమాచారం. గత టీడీపీ ప్రభుత్వంలో నెయ్యి సరఫరా, తనిఖీల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించేవారు. సురేంద్రనాథ్పై అప్పుడు ఎలాంటి ఆరోపణలూ లేవు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక కథ మారింది.